Thursday, 21 April 2016

బొబ్బిలియుద్ధం పగలను చెరిపేసిన బాబు

బొబ్బిలియుద్ధం పగలను చెరిపేసిన బాబు

బొబ్బిలి యుద్ధం గురించి విననివారు తెలుగు నేలపై దాదాపుగా ఎవరూ ఉండరు. తెలుగు నేలపైనే కాదు... భారతదేశమంతటా బొబ్బిలి యుద్ధం గురించి తెలుసు. ఎన్ని తరాలు మారినా కూడా ఇప్పటికే  బొబ్బిలి యుద్ధంపై సినిమాలు కూడా వచ్చాయి... తాండ్రపాపారాయుడి వీరత్వంపైనా సినిమాలు వచ్చాయి..
  
చిరకాల వైరం..
  బొబ్బిలి రాజులు - విజయనగరం రాజుల మధ్య 1757 జనవరి 23న బొబ్బిలి వద్ద యుద్ధం జరిగింది. అంతకుముందు నుంచీ కూడా ఈ రెండు సంస్థానాల మధ్య వైరం ఉండేది. 1757కి కొద్దికాలం ముందు నుంచి ఉత్తరాంధ్ర సంస్థానాధీశులంతా ఫ్రెంచివారికి శిస్తు చెల్లించడం మానేశారు. ఒక్క విజయనగరం రాజులు మాత్రమే చెల్లిస్తుండేవారు. 1757లో ఫ్రెంచి జనరల్ బుస్సీ ఉత్తరాంధ్రకు వచ్చి రాజకీయం నడిపాడు. తమకు శిస్తు చెల్లించనివారిలో బలమైన రాజులైన బొబ్బిలి రాజులను ఇక్కట్లకు గురిచేయాలనుకున్నాడు. అందుకు బొబ్బిలి - విజయనగర రాజుల వైరాన్ని అవకాశంగా తీసుకున్నాడు. అప్పటి విజయనగరం రాజు విజయరామరాజు అండతో ఫ్రెంచి సైన్యాన్ని బొబ్బిలి కోటపైకి నడిపించాడు. వీరికి నిజాం సైన్యం - పెద్దాపురం రాజులు కూడా తోడయ్యారు. ఆ సమయానికి బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు బావమరిది - సైన్యాధ్యక్షుడైన తాండ్ర పాపారాయుడు రాజాం వద్ద ఉంటాడు. దీంతో బొబ్బిలిరాజా రంగారావే స్వయంగా యుద్ధంలో పాల్గొంటాడు. రాణీ మల్లమ్మదేవి వెంటనే తన సోదరుడు తాండ్ర పాపారాయుడికి కబురు పంపిస్తుంది.. కానీ ఆ వేగులను విజయనగరం రాజు సైన్యం హతమార్చడంతో పాపారాయుడికి విషయం చేరదు. ఇంతలో విజయనగరం రాజులు - ఫ్రెంచి సైన్యం - మిగతావారు కలిసి మూకుమ్మడిగా దండయాత్ర చేయడంతో బొబ్బిలి రాజు వారిని ఎదిరించలేకపోతాడు. అప్పటికే రాజు బంధువులను - బొబ్బిలి ప్రజలను చిన్నాపెద్దా తేడాలేకుండా అందరినీ ప్రత్యర్థులు హతమార్చుకుంటూ పోతుండడంతో మరణం తప్పదని గ్రహిస్తాడు. రాణి మల్లమ్మ కూడా ఆత్మత్యాగం చేసుకుంటుంది. రాజా రంగారావును విజయనగరం రాజులు హతమారుస్తారు.  తాండ్రపాపారాయుడు కోటకు వచ్చేసరికి రాజా రంగారావు - తన సోదరి మల్లమ్మ అందరూ రక్తపుటేరుల్లో ఉండడంతో ఆయన తన అనుచరులు ఇద్దరిని వెంటేసుకుని వెళ్లి విజయనగరం రాజుల శిబిరంలో చొరబడి విజయనగరం మహారాజైన పెద్ద విజయరామరాజును గుండెల్లో పొడిచి చంపేస్తాడు.  ఆ తరువాత బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు కుమారుడు - అప్పటికి పసివాడైన చిన్న రంగారావు అనంతర కాలంలో బొబ్బిలి రాజవుతాడు. విజయనగరం సింహాసనం కూడా వారసులకు చెల్లుతుంది. కానీ... అప్పటి నుంచి రెండు రాజవంశాల మధ్య పూర్తి వైరం ఉంది.

బొబ్బిలి రాజా రావు శ్వేతాచలపతి సర్ వెంకట కృష్ణ రంగారావు మరణించినప్పుడు కూడా విజయనగరం రాజులెవరూ వెళ్లలేదు. ఆ తరువాత చాలాకాలం పొలిటికల్ గ్యాప్ తరువాత బొబ్బిలి రాజులు మళ్లీ రాజకీయ రంగప్రవేశం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు - ఆయన తమ్ముడు బేబీనాయనలు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సమయంలో వారు టీడీపీలో చేరాలనుకున్నారు. కానీ టీడీపీలో అప్పటికే మంచి పొజిషన్ లో ఉన్న విజయనగరం రాజు అశోక్ గజపతి రాజు వారి రాకను వ్యతిరేకించారు
  
చారిత్రక కలయిక..
  
ఈసారి పరిస్థితులు మారాయి. విజయనగరం రాజు అశోక్ గజపతి అప్పటి కంటే కూడా టీడీపీలో పెద్ద నేతయ్యారు. కానీ ఈసారి ఆయన బొబ్బిలి రాజులను వ్యతిరేకించలేదు. బొబ్బిలి రాజులు కూడా వైరం మరిచి అశోక్ తో సయోధ్యకు ప్రయత్నించారు. అశోక్ అన్నగారు ఆనందగజపతి రాజు మరణించడంతో అశోక్ ను పరామర్శించడం కోసం బొబ్బిలి బ్రదర్సు ఇద్దరు విజయనగరం కోటలో అడుగుపెట్టి అశోక్ ను పరామర్శించారు. 259 ఏళ్ల వైరానికి ముగింపు పలకడానికి ముందడుగు వేశారు. అశోక్ కూడా వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని మాట్లాడారు.
తాజాగా ఈరోజు బొబ్బిలి రాజులు టీడీపీలో చేరారు. వారు టీడీపీలో చేరడం కంటే విజయనగరం రాజులతో కలిసిమెలసి పనిచేయబోవడం అన్నది చర్చనీయాంశంగా మారింది. రెండు రాజవంశాలవారు కలిసి మాట్లాడుకోవడం.... లేదంటే ఒకరి కోటకు ఇంకొకరు వెళ్లడమన్నది ఇంతవరకు చూడలేదని విజయనగరం బొబ్బిలి ప్రజలు చెబుతున్నారు. రెండున్నర శతాబ్దాల వైరానికి ముగింపు పడడంపై ఉత్తరాంధ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇంత గొప్ప నూతన చరిత్ర ఆవిష్కృతం కావడం వెనుక బొబ్బిలి విజయనగరం రాజుల పాత్రతో పాటు తెదేపా అధినేత చంద్రబాబు పాత్ర కూడా మరవలేనిదంటున్నారు.

No comments:

Post a Comment